Editorial

Sunday, September 22, 2024
కథనాలుపత్రికారంగం - ఆధిపత్య ప్రాంతం - కాసుల ప్రతాపరెడ్డి

పత్రికారంగం – ఆధిపత్య ప్రాంతం – కాసుల ప్రతాపరెడ్డి

తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (TJF) తెచ్చిన ‘తెలంగాణ, మే 31 2001’ పుస్తకంలోని ఏడో వ్యాసం ఇది. ఆధిపత్య ప్రాంతం ఎన్ని విధాలా సకల ఆవరణలను తొక్కి పెట్టి తన ప్రాంతీయ ప్రయోజనాలను కాపాడుకుంటుందో కాసుల ప్రతాపరెడ్డి గారు ఈ వ్యాసంలో విశదం చేశారు. వారు TJFను భిన్న భావజాలాలకు కేంద్రంగా నిలపడంలోనూ, దాని అవిర్భావానికి సిద్దాంతిక దిక్సూచిగా నిలిచిన వారిలోనూ ముఖ్యులు. చాలా నిశితమైన వ్యాసాలతో ఈ పుస్తకం రావడానికి గల చారిత్రక ఆవశ్యకతని గుర్తించి వెన్నుదన్నుగానూ నిలిచిన వారు కూడా.
ప్రత్యేక తెలంగాణా ఆవశ్యకతను రాజకీయ ఆర్థిక కోణాల్లోనే కాకుండా ఉపరితలంగా భావించే భాషా, సంస్కృతుల అస్తిత్వం నుంచి ఎంతో లోతైన పునాది ఆలోచనలు చేసిన ఇద్దరు, ముగ్గురు పాత్రికేయుల్లో వారొకరు. విశేషం ఏమిటంటే, తెలుగు పత్రికారంగంలో రిపోర్టింగ్ నుంచి ఎడిటర్ స్థాయి వరకూ ఎదిగిన అతి కొద్ది మంది తెలంగాణ దేశీయ మేధావులతో పోలిస్తే.. ప్రతాపరెడ్డి గారు లోప్రోఫైల్ లో కనబడే వ్యక్తి. దశాబ్ద కాలం నుంచే అంతర్జాలం – సామాజిక మాధ్యమపు హోరులో తన ప్రభావాన్ని కాపాడుకుని, డిజిటల్ జర్నలిజంలో నిలదొక్కుకుని, ఆ విభాగం పాత్రికేయుల హక్కుల గురించి కూడా గొంతెత్తిన వారు. ప్రస్తుతం ఏషియా నెట్ న్యూస్ తెలుగు సంపాదకులుగా ఉన్న తాను పత్రికారంగపు పోకడలలో తనను తాను పునర్ నిర్వచించుకున్న వ్యక్తిగా, తొంభయ్యవ దశకం తర్వాత.. వివిధ అస్తిత్వాల వికాసంలో.. ప్రభావశీలమైన భావాలు అందించిన సాహిత్య విమర్శకులుగా, మలి తెలంగాణ ఉద్యమంలో.. తెలంగాణ దృక్కోణంలో కొత్త చూపు ప్రసరించిన వారిగా తనది బహుముఖ కృషి. అందుకు వారు వెలువరించిన గ్రంధాలే కాదు, మచ్చుకి ఈ వ్యాసం కూడా మంచి ఉదాహరణ.

పత్రికా రంగంలో కూడా ప్రాంతీయ అసమానతలకు తావుందా? ఆధిపత్య ప్రాంతం ప్రయోజనాలు పత్రికా రంగం కాపాడుతుందా, వెనుకబడిన బలహీన ప్రాంతాల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రయత్నిస్తుందా? తెలుగు పత్రికా రంగం నిర్వహిస్తున్న పాత్ర ఏమిటి? ఇవీ ప్రశ్నలు.

ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి ముందు పత్రికా రంగం ఎటునుంచి ఎటు ప్రయాణించిందనే విషయం తెలుసుకోవడం అవసరం. స్వాతంత్ర్య పూర్వకాలం పత్రికలు ఈ లక్ష్య సాధనలో భాగం పంచుకోవడానికి ఆవిర్భవించాయి. స్వాతంత్ర్య కాంక్షను ప్రజలలో రగుల్కొల్పి ప్రజలను బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా సాగిన జాతీయోద్యం వైపు మళ్ళించేందుకు, రాజారామ్ మోహన్ రాయ్ సంస్కరణోద్యమం ప్రేరణతో సామాజిక రుగ్మతలను రూపు మాపేందుకు చైతన్య దీపికలుగా కోస్తాంధ్ర పత్రికలు పని చేస్తే తెలంగాణాలోని పత్రికలు నిజాం వ్యతిరేకోద్యమానికి ప్రజలను సమాయత్తం చేయడానికి, తెలుగు సంస్కృతీ పరిరక్షణకు పని చేశాయి. ఇక్కడ వ్యాపారం పత్రికల ప్రధానోద్దేశం కాదు. స్వాతంత్ర్యానంతరం పత్రికలు నిర్వహించే పాత్ర పూర్తిగా మారిపోయింది. పత్రికలను నడపడమనేది వ్యాపారంగా మారిపోయింది. సినిమా నిర్మాణంలో, పచ్చళ్ళ వ్యాపారంలో ఇతరేతర వ్యాపారాల్లో లాభాలు ఆర్జించినట్లుగానే పత్రిక ప్రచురణ రంగంలో లాభాలు ఆర్జించాలనే కాంక్షతోనే పత్రికల స్థాపన జరిగి, అందుకు అనుగుణంగానే నడుస్తున్నాయి. ఇతర ప్రధాన వ్యాపారాలను కాపాడుకోవడానికి పత్రికలు యాజమాన్యాలకు అస్త్రాలుగా ఉపయోగ పడుతున్నాయి. తెలుగులో ప్రధానంగా నడుస్తున్న ‘ఈనాడు’, ‘ఆంధ్రభూమి’, ‘వార్త’ పత్రికలు ఏ ఉద్దేశాలతో నడుస్తున్నాయో వేరుగా చెప్పనక్కర్లేదు. ఈ పత్రికల యజమానులెవరూ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కారు. సినీ దర్శకుడు దాసరి నారాయణరావు చేతుల నుంచి మాగుంట కుటుంబానికి ‘ఉదయం’ దిన పత్రిక మారిన తర్వాత అది ఏ ప్రయోజనాల కోసం నడిచిందో, మద్య నిషేధం అమలుతోనే దానికి నూరేళ్లు ఎందుకు నిండాయో విడమర్చి చర్చించాల్సిన అవసరం కూడా లేదు. ‘ఆంధ్రజ్యోతి’ దిన పత్రిక సంగతి తెలియంది కాదు. యాజమాన్యం ప్రయోజనాలకన్న పత్రికను నిర్వహించిన కొద్దిమంది జర్నలిస్టుల వ్యక్తిగత ప్రయోజనాలకు అది ఉపయోగపడి మూత పడింది. నష్టాలు వచ్చాయి కాబట్టే పత్రికలను మూసివేశామని యజమానులు వాదిస్తారు. వాదిస్తున్నారు. పత్రికల అమ్మకాలకు, ఇతరేతర వినియోగ, నిత్యావసర సరుకుల వ్యాపారానికి తేడా ఉంది. ఈ తేడా సమాజానికి, పత్రికా రంగానికి విడదీయరాని సంబంధం వుండడమే.

‘తెలంగాణ, మే 31, 2001’ పుస్తకంలోని వ్యాసాలను ‘తెలుపు’ ధారావాహికంగా  ప్రచురిస్తోందని మీకు తెలుసు. ఇప్పటిదాకా అచ్చైన వ్యాసాలను ఆయా శీర్షికలను క్లిక్ చేసి చదువుకోగలరు. తెలంగాణ, మే 31, 2001 – చారిత్రాత్మక సంపాద‌కీయం . మన ప్రతాపరెడ్డికి వందనాలు- కె. శ్రీనివాస్ వ్యాసం. ‘తెలంగాణ’ కార్టునిస్టుల ఖజానా –టి. ఏడుకొండలు.  ఒక ఆత్మ హత్య /ఒక హత్య/ ఒక సామూహిక ఖననం – అంబటి సురేంద్రరాజు. తెలంగాణ ఒక నిషిద్ధ ఆలోచన – ఎస్.రామకృష్ణ.  పత్రికలు- వ్యాపారం- తెలంగాణ ఉద్యమం : దుర్గం రవీందర్ 

యజమానులు పత్రికలను కేవలం పచ్చళ్ళ వ్యాపారంగానో, మద్య వ్యాపారంగానో, బట్టల వ్యాపారంగానో, హోటల్ బిజినెస్ లాగానో చూడడంలేదు. రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోడానికి పత్రికారంగం మంచి అస్త్రం అనే విషయం యాజమాన్యాలకు కూడా తెలుసు. వివిధ పత్రికల యజమానుల మధ్య ఆ రంగంలో జరిగే పోటీలో ఓడి పోయిన వారు కిరాణ కొట్టును మూసేసినంత సులభంగా పత్రికాఫీసును మూసేస్తున్నారు.

ఇదంతా పత్రికా రంగంలో కనిపించే వ్యవహారం. కనిపించని వ్యవహారం ఏమైనా ఉందా? అదృశ్య రంగాల్లోనే పత్రికా రంగం ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది.

పత్రిక నిర్వహణ మేధస్సుకు మేధస్సుకు సంబంధించిన విషయం కాబట్టి అందులో పనిచేసేవారు మేధావులు కాబట్టి, పత్రికా రచన ఒక సేవాకార్యక్రమం కాబట్టి, తమ పక్షపాతం వుండదని ప్రకటించుకుంటాయి కాబట్టి పత్రికల్లో వచ్చే విషయాలకు విలువ వుంటుంది. (ఇవాళ ఏ పత్రిక ఏం రాస్తుందనే విషయం ప్రజలు పసిగట్టగలిగే స్థితి వచ్చింది. ఇది కేవలం రాజకీయాల విషయంలోనే. ఇది వేరే విషయం).

స్వాతంత్ర్యానంతరం పత్రికా రంగానికి ఒక ఉన్నతాశయం లేకపోవడం అది వ్యాపార రంగంలో భాగమై పోవడం వంటి కారణాల వల్ల అవి నెరవేరే ప్రయోజనాలు కూడా ప్రజా వ్యతిరేకంగానే వుంటాయి. అయితే, ఇది బయట పడకుండా ప్రజా పక్షాన ఉన్నామని ప్రకటించుకునేందుకు కూడా కొన్ని పనులు చేస్తూ వుంటుంది. ఈ దృష్ట్యా అది ఆధిపత్య రాజకీయాలను కాపాడుతూ వుంటుంది. ఈ ఆధిపత్య రాజకీయాల్లోని వైరుధ్యాలను బయట పెడుతూ అదొక ప్రజాస్వామిక, స్వయం ప్రతిపత్తి పాత్రను పోషిస్తున్నట్లు నటిస్తుంది. ఈ క్రమంలోనే అది ఆధిపత్య ప్రాంతానికి, ‘ఆధిపత్య కులానికి (వర్గానికి కూడా) బాసటగా నిలుస్తుంది. విశాల ప్రాతిపదికపై చూస్తే ఆధిపత్య వర్గానికి అండగా నిలబడే పత్రికా రంగం ప్రాంతీయంగా కూడా ఆధిపత్య ప్రాంతానికి, కుల పరంగా ఆధిపత్య కులాలకు, సంస్కృతి పరంగా ఆధిపత్య సంస్కృతికి, సామాజికంగా ఉన్నత వర్గాలకు నష్టం వాటిల్లకుండా, వాటికి ప్రయోజనం చేకూరుస్తూ నడుస్తుంది.

2

‘ఆధిపత్య ప్రాంతం ప్రయోజనాలను కాపాడడానికి రాజకీయాలు, సమస్యలు, సంస్కృతి, భాష అనే నాలుగు అంశాల్లో ప్రతికారంగం ప్రధాన పాత్ర పోషిస్తూ వుంది. కోసాంధ్ర ప్రయోజనాల పరిరక్షణకు అది ఆ మూడు రంగాల్లో అంతర్లీనంగా ఆధిపత్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తోంది.

రాజకీయమే నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది కాబట్టి రాజకీయాల్లో ఆదిపత్య ప్రాంతమైన కోస్తాంధ్ర ఆధిపత్యం కొనసాగేలా పత్రికా రంగం చూస్తుంది. నాయకులకు స్టేటస్ ఇవ్వడంలో పత్రికలు నిర్ణయాత్మక పాత్ర నిర్వహిస్తున్నాయి. ఆధిపత్య ప్రాంతం ప్రయోజనాలు కాపాడడానికి ఆ ప్రాంత రాజకీయ నేతలు ఎప్పుడూ ఒక ప్రెషర్ గ్రూప్గా వుంటూ వస్తున్నారు. ఇది మద్రాసు నుంచి విడి పడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కొనసాగుతూనే వుంది. ఈ ప్రెషర్ గ్రూప్ చర్యలకు, మాటలకు, చేతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంవల్ల ఆ ప్రాంత ప్రయోజనాలను పత్రికా రంగం కాపాడుతూ వస్తోంది. ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి వున్నా, పి.వి. నరసింహారావు ఉన్నా అక్కడి రాజకీయాల ఒత్తిడికి తలొగ్గాల్సిందే. ముఖ్యమంత్రి అయిన టంగుటూరి అంజయ్యను దెబ్బ కొట్టడానికి ఆయనను ఒక జోకర్గా చిత్రీకరించే పనికి పత్రికలు సమర్థంగా ఒడిగట్టాయి. అంజయ్యపై విమర్శలు, ఆరోపణలు చేయడానికి ఏమీ లేకపోవడంతో ఈ దొడ్డి దారిని పత్రికలు ఎంచుకున్నాయి.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మీడియాను మేనేజ్ చేసే ఒక కొత్త పద్ధతి అమలులోకి వచ్చింది. ఇందులో భాగంగా తెలుగు దేశం పార్టీ మీడియాలో ‘క్రియాశీలక కార్యకర్తలు’ తయారయ్యారు. పత్రికా ప్రతినిధులు ‘పూర్తిగా స్వేచ్చ’ను కోల్పోవడం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. కొంత మంది ఇట్లే ధనవంతులై పోవడం కళ్ళ ముందు కనిపిస్తున్నదే.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మీడియాను మేనేజ్ చేసే ఒక కొత్త పద్ధతి అమలులోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ శిక్షణా కార్యక్రమాల్లో దీనికి ప్రధాన స్థానం ఇస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగు దేశం పార్టీ మీడియాలో ‘క్రియాశీలక కార్యకర్తలు’ తయారయ్యారు. పత్రికా ప్రతినిధులు ‘పూర్తిగా స్వేచ్చ’ను కోల్పోవడం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ఒక కోస్తా అగ్రకుల మీడియా పత్రినిధులు కింది నుంచి పై స్థాయి వరకు తెలుగుదేశం వల్ల లాభపడ్డారు. కొంత మంది ఇట్లే ధనవంతులై పోవడం కళ్ళ ముందు కనిపిస్తున్నదే. పత్రికారంగంలోకి ‘అంకిత భావం’, ‘ సేవా దృక్పథం’ తో వచ్చిన తెలంగాణా జర్నలిస్టుల పాలిట ఇది శాపంగానే పరిణమించింది. ఆ కోస్తాంధ్ర జర్నలిస్టుల బాటలో నడవబోయి సంపాదించిన దాని కన్నా ఎక్కువ బద్నామ్ అయిన తెలంగాణా జర్నలిస్టుల ‘జాతి’ ఒకటి పుట్టుకొచ్చింది. ఆ జాతిది ఇప్పుడు పెత్తనం కూడా.

తెలుగు దేశం పార్టీకి జర్నలిస్టుల్లో క్రియాశీలక కార్యకర్తలను తయారు చేసుకున్న తర్వాత తెలంగాణలోని ప్రజా ఉద్యమాల పక్కన నిలబడుతూ వస్తున్న జర్నలిస్టులు, ‘మానసిక అణచివేతకు గురిచేయబడుతూ వస్తున్నారు. ఇన్ సైడ్ వార్తల రూపు రేఖలు కూడా మారిపోయాయి. ప్రజల పక్షపాతంతో కాకుండా పాలక పక్షపాతంతో కూడిన వార్తలు వార్తా పత్రికల పేజీలను ఆక్రమిస్తూ వస్తున్నాయి. వార్తలను మానుప్యులేట్ చేసే సరికొత్త విధానం జర్నలిజంలో అమలవుతూ వస్తోంది.

3

సమస్యల విషయానికి వస్తే, కొన్ని ప్రాంతాల సమస్యలను రాష్ట్ర ప్రజల సమస్యలుగా ముందుకు తేవడంలో పత్రికలు ముందుంటున్నాయి. కొన్ని ప్రాంతాల సమస్యలు విచ్చిన్నకర, ప్రాంతీయ ధోరణిని రెచ్చగొట్టె సమస్యలుగా ఆ మాత్రమే కనిపించడం ఇందులో భాగమే. రాజకీయ విశ్లేషణలు చేసే సమయంలో తప్ప తెలంగాణ ప్రస్తావన రాకుండా పత్రికలు జాగ్రత్త పడుతూ వుంటాయి. నీటి పారుదల ప్రాజెక్టుల గురించి జరుగుతున్న వ్యవహారాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా బోధపడుతుంది. పోలవరం ప్రాజెక్టు గురించి వచ్చినప్పుడు గానీ, పులిచింతల ప్రాజెక్టు అంశం ముందుకు వచ్చినప్పుడు గానీ, రాయలసీమ నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో గానీ ఆయా ప్రాంతాల ప్రయోజనాలు కాపాడే వార్తలు ప్రముఖంగా జనరల్ పేజీల్లో అచ్చవుతాయి. పోలవరం ప్రాజెక్టును చేపట్టాలంటూ ఒక శాసన సభ్యుడు పాదయాత్ర చేస్తే ఆ వార్త ప్రముఖంగా వార్తల కెక్కుతుంది. తెలంగాణా ప్రాజెక్టుల గురించి రాసినా, మాట్లాడినా ప్రాంతీయ ధోరణిని రెచ్చగొట్టే విచ్చిన్న కారులుగా కనిపించడం మామూలయిపోయింది.

ఈ వార్త వచ్చిన డమ్మీ ప్రజల్లోకి వెళ్ళదని తెలిసి కూడా పొత్తూరు వెంకటేశ్వరరావు అంత అసహనం ప్రదర్శించారు. ప్రజల్లోనే వెళ్ళే పత్రికల్లో తెలంగాణకు సంబంధించిన సమస్యలను రాయాలంటే ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. ఇది ఉదాహరణ మాత్రమే.

నిర్ణయాత్మక స్థానాల్లో వున్న జర్నలిస్టులు ఈ ధోరణిని పోషించడం సర్వసాధారణంగా వస్తున్న విషయం. ఇక్కడ ఒక ఉదాహరణ – ‘ఉదయం’ దిన పత్రిక మూత పడిన తర్వాత కొన్నాళ్లకు పునరుద్దరణ ప్రయత్నాలంటూ జరిగాయి. ఆ సమయంలో ప్రెస్ అకాడమీ ప్రస్తుత చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు సంపాదకుడిగా వచ్చాడు. పత్రిక మార్కెట్లోకి రావడానికి ముందు వార్తలు రాయించి డమ్మీల పేరుతో లే అవుట్ చేసిన జిరాక్స్ ప్రతులను కొన్నాళ్లు వెలికి తీశారు. ఈ సందర్భంలో ఒక జర్నలిస్టు ఓ వార్త రాశాడు. గోదావరి జలాల పంపకం విషయంలో జలగం వెంగళరావు ప్రభుత్వ హయాంలో పొరుగు రాష్ట్రాలతో చేసుకున్న ఒప్పందం తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ తీసేదిగా వుందనేది వార్త. భారీ నీటిపారుదల మంత్రిగా పని చేసిన శీలం సిద్ధారెడ్డి ఈ ఒప్పందం వల్ల ఏవిధంగా తెలంగాణకు నష్టం జరుగుతుందనే విషయాన్ని అంకెలతో సహా సోదాహరణంగా వివరిస్తూ ఒక ప్రకటన చేశారు. ఎమర్జెన్సీ రోజుల్లో ఇది జరిగింది. ఎమర్జెన్సీ కారణంగా శీలం సిద్ధారెడ్డి ప్రకటన సెన్సార్ అయి, అచ్చుకే నోచుకోలేదు. కృష్ణా జలాల వివాదం ముందుకు వచ్చినప్పుడు తాను పొరుగు రాష్ట్రాలతో సామరస్య పూర్వకంగా గోదావరి జలాల వివాదాన్ని పరిష్కరించానని జలగం వెంగళరావు చెప్పుకున్నారు. ఈ విషయంలో ఆ జర్నలిస్టు శీలం సిద్ధారెడ్డి ప్రకటనను ఆధారం చేసుకుని శీలం సిద్ధారెడ్డి మాటలను వుటంకిస్తూ వార్త రాశాడు. దాన్ని చూసిన పొత్తూరి వెంకటేశ్వరరావు మనం ఏ ప్రాంతానికి మద్దతు కాదు కదా! ఇటువంటి వార్తలు ప్రాంతీయ ధోరణులను పెంచుతాయి కదా!’ అని అన్నారు. ఈ వార్త వచ్చిన డమ్మీ ప్రజల్లోకి వెళ్ళదని తెలిసి కూడా పొత్తూరు వెంకటేశ్వరరావు అంత అసహనం ప్రదర్శించారు. ప్రజల్లోనే వెళ్ళే పత్రికల్లో తెలంగాణకు సంబంధించిన సమస్యలను రాయాలంటే ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. ఇది ఉదాహరణ మాత్రమే.

పత్రికల్లో వార్తా రచనకు సంబంధించిన నిర్ణయాత్మక పాత్ర కోస్తాంధ్ర జర్నలిస్టులదే కాబట్టి తెలంగాణ సమస్యలు అచ్చయ్యే పరిస్థితి వుండదు. దీంతో తెలంగాణ సబ్ ఎడిటర్లు, రిపోర్టర్లు దానికే తమను తాము బలవంతంగానైనా సరే ట్యూన్ చేసుకుంటారు. తెలంగాణకు సంబంధించి ఏది రాయలన్నా తెలంగాణ జర్నలిస్టులు భయపడే స్థితి వుంది. రాస్తే అచ్చు కావు. పైగా ఉద్యోగం ఊడిపోవచ్చు. అందువల్ల ఒళ్ళు దగ్గర పెట్టుకుని తెలంగాణా జర్నలిస్టులు సాధ్యమైనంత ఎక్కువ విశాల దృష్టిని అలవర్చుకుంటున్నారు.

పులిచింతల ప్రాజెక్టును తెలంగాణ శాసన సభ్యులు వద్దంటే అది నేరంగా చిత్రీకరింపబడుతుంది. తమ తమ ప్రాంతాలకు చెందిన ప్రాజెక్టుల సాదనకు కోస్తాంధ్ర, రాయలసీమ రాజకీయ నేతలు పార్టీలకతీతంగా కలిసికట్టుగా పోరాడితే అది ఏ పార్టీ నాయకత్వానికి గానీ క్రమశిక్షణను ఉలంఘించడంగా కనిపించదు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో, సమస్యల విషయంలో అన్ని పార్టీల నేతలు కలిసి చేసే ఉద్యమం ఆయా పార్టీ నాయకత్వాల కన్నెర్రకు గురవుతుంది. వెంటనే, నాయకత్యాలు ఆదేశాలు పంపిస్తాయి. పార్టీ నాయకత్వాలు ఏదైతే చేస్తాయో అదే న్యాయమైన చర్యగా పత్రికలకు కనిపిస్తుంది. అదే వైఖరిని తీసుకుంటాయి గానీ దానికి భిన్నమైన వైఖరి తీసుకోవు. తెలంగాణలో నక్సలైట్ హీరోయిక్ కార్యకలాపాలకు మార్కెట్ వుంది కాబట్టి వాటినే ప్రముఖంగా ప్రచురిస్తాయి. ఒకప్పుడు ఎన్కౌంటర్లను ప్రముఖంగా ప్రచురిస్తే పత్రికలు హాట్ కేల్లా అమ్ముడుపోయేవి. ఇప్పుడు వాటికి గిరాకీ తగ్గింది కాబట్టి ఇతరత్రా నక్సలైట్ కార్యకలాపాలకు అవి ప్రాధాన్యం ఇస్తున్నాయి. తెలంగాణ సమస్యలు పత్రికల్లో అచ్చు కాకుండా నక్సలైట్ సమస్యను పత్రికలు ప్రధానాస్త్రంగా ఎంచుకుంటున్నాయి. అందుకే, జిల్లా రిపోర్టర్లుగా, జిల్లాల డెస్క్ ఇన్ చార్జీలుగా ఎక్కువగా కోస్తాంధ్ర జర్నలిస్టులనే నియమిస్తూ వుంటారు. ‘ఈనాడు’ దినపత్రికా నియామకాలను, బదిలీలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ‘వార్త’ దిన పత్రిక ప్రారంభ దశలో ఒక కోస్తాంధ్ర జర్నలిస్టును ఉత్తర తెలంగాణా ప్రతినిధిగా నియమించడంలోని అంతర్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సంపాదక వర్గంలో ఎక్కువగా కోస్తాంధ్ర జర్నలిస్టులే వుంటారు. ఈ స్థితిలో యాజమాన్యానికి అర్థం కాకుండా కూడా పై స్థాయిలో వుండే జర్నలిస్టులు ఇటువంటి నాటకం ఆడవచ్చు. ఈ వెసులుబాటు పత్రికల్లో వుంది. అదే పత్రికల్లో ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి వుండడానికి సంపాదకుడు తెలంగాణకు చెందిన జర్నలిస్టు కావడం, యాజమాన్యం తెలంగాణకు అనుకూలంగా వుండడం కారణాలు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తలెత్తినప్పుడయినా దానికి మూలాలను వెతికే పని పత్రికలు చేయలేరు. ఈ కనీస బాధ్యత నుంచి తప్పుకోవడానికి ప్రాంతీయ ధోరణిని రెచ్చగొట్టే పనిగా, విచ్ఛిన్నకర చర్యగా చిత్రీకరించారు.

ప్రజలకు అండగా నిలిచిన షోయబుల్లా ఖాన్ గానీ, పత్రికా నిర్వహణను యజ్ఞంలా నిర్వహించిన సురవరం ప్రతాపరెడ్డి ని గానీ, మరెవరినీ పత్రికా రంగం పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ సాయుధ పోరాట వీరులనేకులు ఈ తరం యువతరానికి తెలియకుండా పోవడానికి పత్రికా రంగమే కారణం.

 

4

అంతర్లీనంగా తెలంగాణ సంస్కృతికి పత్రికా రంగం చేసిన నష్టం అంతా ఇంతా కాదు. కోస్తాంధ్ర కళాకారుల, సాహితీవేత్తల, సంఘ సంస్కర్తల జయంతులకు, వర్ధంతులకు ప్రత్యేక వ్యాసాలు రాయించి అచ్చేసే పత్రికలు ఇక్కడి ప్రముఖులను పట్టించుకోలేదు. ప్రజలకు అండగా నిలిచిన షోయబుల్లా ఖాన్ గానీ, పత్రికా నిర్వహణను యజ్ఞంలా నిర్వహించిన సురవరం ప్రతాపరెడ్డి ని గానీ, మరెవరినీ పత్రికా రంగం పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ సాయుధ పోరాట వీరులనేకులు ఈ తరం యువతరానికి తెలియకుండా పోవడానికి పత్రికా రంగమే కారణం.

సాహితీ రంగంలో కోస్తా సాహిత్య కారులు హీరోలు కావడం దీనివల్లనే తెలంగాణ సాహితీ వేత్తలు మరుగున పడిపోయి కోస్తా సాహితీ వేత్తలు తెర మీదకు రావడం సాగించారు. దీనికి కోస్తా పక్షపాతం పనిచేస్తోంది. నవలా సాహిత్యం గురించి వట్టికోట ఆళ్వారు స్వామిని, దాశరథి రంగా చార్యుల పేరెత్తకుండా వ్యాసం రాయగలుగుతున్నారంటే వారి సాంస్కృతికాధిపత్యం ఎంత దూరం వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. దీనికి రెండు ఉదాహరణలు – తెలంగాణా ప్రత్యేకోద్యమం ముందుకు వచ్చన వెంటనే రేగడి విత్తులు నవల రాయడం, దానికి అమెరికాలో ఒక అగ్రకులం నేతృత్వం వహిస్తున్న తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) అవార్డు రావడం, సంపాదకాగ్రేసరుడు ఎబికె ప్రసాద్ సంపాదకీయం రాయడం తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధమైన చర్యనే తెలంగాణ వెనుకబాటుతనం గురించి దానికి గల కారణాల గురించి నవల రాస్తే అది అచ్చుకు కూడా నోచుకోలేదు. అలాగే, సాహిత్య రంగంలో ‘నామాడి శ్రీధర్ స్థానం తెలియంది కాదు. అతని కవిత్వంపై కూడా ఎబికె ప్రసాద్ సంపాదకీయం రాసి తన ఉదారతను ప్రదర్శించుకున్నారు.

సాంస్కృతికంగా తెలంగాణాను వెన్నుపోటు పొడిచే ప్రక్రియకు జర్నలిస్టులు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పావులు కదుపుతూ వున్నారు. ఈ జర్నలిస్టులు ప్రజాస్వామిక వాదులుగా, ప్రగతి శీలురుగా ముద్రవేయించుకోవడానికి వీరు నక్సలైట్ ఉద్యమ సానుభూతి పరులుగా చెలామణి అవుతారు.

ఇక భాష గురించి మాట్లాడాల్సివస్తే, పత్రికల్లో తెలంగాణ యాసకు స్థానమే లేకుండా పోయింది. హైదరాబాద్ ఎడిషన్లలో సరే, తెలంగాణ జిల్లాల ఎడిషన్లలో కూడా ప్రజల భాషకు సరే, మాటలకు కూడా చోటు లేకుండా చేశారు. అంజయ్య ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు మాత్రం ఆయనను ఒక జోకరుగా చిత్రీకరించడానికి తెలంగాణ మాండలికం వాడారు. భాషను గానీ, యాసను గానీ వాడే పద్ధతే దాని ప్రయోజనమేమిటో తెలియజేస్తుంది. అంజయ్య మాటలను ‘సెటైర్’గా మార్చడం ద్వారా ఆయన స్థాయిని తగ్గించే ప్రయత్నం చేశారు.

భాషకు విడిగా సొంత అస్తిత్వం లేదని కోస్తాంధ్ర జర్నలిస్టు మేధావులకు తెలియదని కాదు. కానీ పత్రికల్లో తమ భాష ఆధిపత్యానికి అనేక అచ్చ తెలుగు మాటలకు కత్తెర వేశారు. గోంగూరను తెలంగాణ జిల్లాల్లో పంపిణీ అయ్యే ఎడిషన్లలోనైనా పుంటి కూరగా రాయడానికి అనుమతించవచ్చు కదా! ఇలాంటి పర్యాయ పదాలను ఏ మాత్రం అనుమతించలేదు.

భాషకు ఉచ్చనీచాలుండవనే విషయం చాలా మంది భాషా శాస్త్ర వేత్తలు చెప్పారు. కేవలం పరస్పర సమాచార వినిమయానికి భాష ఒక సాధనం మాత్రమే. చెప్పాలంటే గుర్తు మాత్రమే. దానికి విడిగా సొంత అస్తిత్వం లేదు. ఈ విషయాలు మేధావులైన కోస్తాంధ్ర జర్నలిస్టు మేధావులకు తెలియదని కాదు. కానీ పత్రికల్లో తమ భాష ఆధిపత్యానికి అనేక అచ్చ తెలుగు మాటలకు కత్తెర వేశారు. గోంగూరను తెలంగాణ జిల్లాల్లో పంపిణీ అయ్యే ఎడిషన్లలోనైనా పుంటి కూరగా రాయడానికి అనుమతించవచ్చు కదా! ఇలాంటి పర్యాయ పదాలను ఏ మాత్రం అనుమతించలేదు. బ్రిటిష్ వలస పాలనలో ఆంగ్ల భాషను మోసి, దానికి దాస్యం చేసిన అనుభవం తెలంగాణ పై చూపిస్తూ వస్తున్నారు. వీరు ఆంగ్ల బాషకు ఎంత దాస్యం చేశారో ఒకటి రెండు మాటలు చూసే అర్థమవుతుంది. వెజిటబుల్ ఆయిల్ ను మంచినూనెగా అనువదించవచ్చు. కానీ వంట నూనె పదమే వారికి నచ్చుతుంది. అలానే డ్రింకింగ్ వాటర్కు మంచి నీరు పదం కన్నా తాగు నీరు పదమే పత్రికా రచయితలకు బాగుండే పరిస్థితి వచ్చేసింది.

బ్రిటిష్ పాలకులు భారత దేశాన్ని వలస ప్రాంతంగా మార్చుకున్న తర్వాత ఇక్కడి సర్వ రంగాలను భ్రష్టు పట్టించే పనికి ఒడిగట్టారు. అలా భ్రష్టు పట్టించి అన్ని రంగాల్లో తమ ఆధిపత్యాన్ని పెంపొందించుకుంటే తప్ప దోపిడీకి మార్గం సుగమం కాదు. తెలంగాణను కోస్తాంధ్ర పెద్దలు ‘అంతర్గతవలస’ గా మార్చుకున్నారు. తమ ఆధిపత్యాన్ని సర్వ రంగాల్లో నెలకొల్పుకోవడానికి పత్రికలు వారికి ‘ఉత్తమోత్తమ’ సాధనాలయ్యాయి.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article