Editorial

Sunday, September 22, 2024
కథనాలు31 మే 2001 : తెలంగాణను మలుపు తిప్పన డేట్ లైన్ -  అల్లం నారాయణ

31 మే 2001 : తెలంగాణను మలుపు తిప్పన డేట్ లైన్ –  అల్లం నారాయణ

జర్నలిస్టుల రాజకీయ అవగాహనల్లో, ఉద్యమ కార్యాచరణలో ఆర్థిక డిమాండ్ల స్థానంలో విస్తృత జాతి ఉత్తేజిత విముక్తి డిమాండ్ ను ముందుకు తెచ్చిన ఉద్యమం అది. తలుచుకోవాల్సిన రోజు

LOGOకల్లోల కాలాలు, ఉద్యమాలు, పోరాటాలు, ఉత్తేజాలు, సామూహిక కార్యాచరణలు మనుషులను సజీవంగా పచ్చని చెట్లలా ఉంచుతాయి. వికసించే కాలాల్లో వీరులు పుడతారు. పోరాడతారు. నిశ్చల కాలాల్లో నిరాశ ఆవరిస్తూ ఉంటుంది. చెట్లు ఎండిపోతుంటాయి. భావధారలు బీళ్లు బారతాయి. కానీ ఉద్యమ కాలాలు జీవితం పొడవునా మనల్ని నడిపే దారి దీపాలుగా ఉంటాయి.

తెలంగాణ జర్నలిస్టులకు సంబంధించి ప్రత్యేక తెలంగాణ అస్తిత్వ పోరాటంలో ఒక వేదికగా ఏర్పడి పోరాడడమే ఒక చైతన్య సందర్భం. వెలిగిన సందర్భం. అది తెలంగాణ జర్నలిస్టులను మలిచిన దారిదీపాంత. ఒక అస్తిత్వపోరాటంలో మమేకమై ప్రత్యక్షంగా పరోక్షంగా తీవ్ర ప్రభావం వేసి తెలంగాణ ఉద్యమానికి కలాలను ఆయుధాలుగా చేసుకొని పోరాడిన తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఏర్పడి రెండు దశాబ్దాలు. సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం 31, మే నాడు ప్రెస్ క్లబ్ లో వందలాది మంది జర్నలిస్టులతో, తెలంగాణ మేరు నగధీరులయిన ప్రముఖ నాయకులతో ఆ సభ జరిగి ఇరవై ఏళ్లు. అప్పటిదాకా ఉన్న జర్నలిస్టు ఉద్యమాల స్వరూప స్వభావాలను మార్చివేసిన ఉద్యమం ప్రారంభమైన రోజు అది. టీజేఎఫ్ అనే చిరునామాకు పుట్టిన రోజు. జర్నలిస్టుల రాజకీయ అవగాహనల్లో, ఉద్యమ కార్యాచరణలో ఆర్థిక డిమాండ్ల స్థానంలో విస్తృత జాతి ఉత్తేజిత విముక్తి డిమాండ్ ను ముందుకు తెచ్చిన ఉద్యమం అది. తలుచుకోవాల్సిన రోజు. ఆ స్పృహాను, అవగాహనను, ఏర్పరచుకున్న అభప్రాయాన్ని పదను పెట్టుకొని ఊరేగాల్సిన సందర్భం ఇది. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టు అనే చైతన్యాన్నిచ్చిన తెలంగాణ జర్నలిస్టు ఫోరమ్ భవిష్యత్ దారి కూడా అదే.

బహిరంగంగా మాట్లాడితే ఏమవుతుందోనన్న భయాల మధ్య, తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి, విముక్తి, ఆధిపత్య భావ జాలాల సారాంశాల స్వరూపాలు అవగాహన చేసుకున్న గుప్పెడు మంది ఆరేడుగురితో అది ప్రారంభం అయ్యింది.

అదేమంత సులభంగా ఏర్పడలేదు. పత్రికా రంగ విస్తరణతోపాటు తెలంగాణ జర్నలిస్టులు పత్రికల్లోకి విరివిగా రావడం. ఆంధ్ర ప్రాంతాల నుంచి ప్రధాన పత్రికల అడ్డా హైదరాబాద్ కావడం. అయినా తెలంగాణ భావన అంటేనే వ్యతిరేకతలు ఉన్నకాలం. జర్నలిస్టులు తెలంగాణ వారే అయినా బయటపడి బహిరంగంగా మాట్లాడే పరిస్థితులు లేవు. వేధింపులు ఎదుర్కొనే ధైర్యం కూడా లేదు. పరాధీనలుగా ఉన్న తెలంగాణ జర్నలిస్టులకు తొలి ప్రేరణ తొలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులే. కానీ అప్పటి పరిస్థితులు వేరు. పరిమితులు వేరు. దక్కన్ క్రానికల్ తప్ప తెలంగాణ ప్రకటనలు కూడా ఇచ్చేవారు కాదు. ఇంత విస్తృతీ లేదు. పటిష్టంగా స్థిరపడ్డ ప్రాంత ఆధిపత్యమూ లేదు. అయినా తొలి తెలంగాణ ఉద్యమ అవగాహనలు కూడా ఉద్యోగాల ఆధారమైన విద్యార్థి, ఎన్జీవో ఉద్యమం. జర్నలిస్టుల సహకారం ఉండేది. ప్రజా సమితి ఏర్పాటులో కొంత పాత్ర కూడా ఉండేది.

కానీ పత్రికల విస్తృతీ, ఎనభయవ దశకం మధ్య నుంచి తొంభైలలో తెలుగుదేశం ఏర్పాటు ఆధీపత్యం పాతుకుపోయి, తెలంగాణ జర్నలిస్టులు బిక్కు బిక్కు మనే పరిస్థితులు. కానీ, 1996 నుంచి ప్రారంభమైన మలి తెలంగాణ ఉద్యమ కదలికలు, మేధావులు, బుద్ధి జీవులు తెలంగాణ పరిస్థితులపై పెంచిన అవగాహనలు, తెలంగాణ అస్తిత్వ సమస్యను అన్ని కోణాల నుంచి అర్థం చేసుకున్న కొత్త అవగాహనలు తెలంగాణ జర్నలిస్టులను కొత్త దృక్కోణాల్లోకి మళ్లించింది. పూర్వ రంగంలో జరిగిన తెలంగాణ జర్నలిస్టు ముఖ్యుల సమావేశాలు, అప్పటికే ఆధిపత్యం, అస్తిత్వం, తెలంగాణ తోవల గడిచిన చర్చ, సంస్కృతి, అస్తిత్వాల ప్రత్యేక వేదికల ఏర్పాట్లు చర్చోప చర్చల కార్యరంగం ఉన్నది.

మరోవైపు బషీర్ బాగ్ పీఠాధిపతులు మే, 31 సభకు అనుమతి నిరాకరించారు. వారి నరనరానా జీర్ణించుకు పోయిన బానిసతనం, ఆంధ్రా ఆధిపత్య భావజాలాలు ఆ ఒక్క రోజే కాదు, ‘ఫోరమ్’ నాయకులను ‘దారి తప్పిన సోదరులు’ అనడం, నెల్లూరులో తెలంగాణ నినాదాలు చేసిన జర్నలిస్టులను కొట్టడం, చివరకు ‘తెలంగాణ వస్తే ఏమొస్తది’ అనే డైలాగుల దాకా, వాళ్లు తెలంగాణ పేరు ఉచ్చరిస్తూనే అంతరంగంలో అటుగట్టునే నిలబడ్డారు. ఈ అన్ని పరిస్థితులను అవగాహన చేసుకున్నాకనే తెలంగాణ జర్నలిస్టు ఫోరమ్ ఏర్పడింది.

తెలంగాణ మే, 31’ అనే ఒక పుస్తకం 13 వ్యాసాల సంకలనం. ఆనాడే ఆవిష్కృతమయింది. ‘ఔర్ ఏక్ దక్కా ఆఖ్ రీ మోఖా’ అనే నినాదంతో ఒక చిన్న కరపత్రం. జర్నలిస్టులు ‘తటస్థతను’ బద్దలు కొట్టి బయటపడ్డారు. కానీ ఏంచేయాలో తెలియదు.

బహిరంగంగా మాట్లాడితే ఏమవుతుందోనన్న భయాల మధ్య, తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి, విముక్తి, ఆధిపత్య భావ జాలాల సారాంశాల స్వరూపాలు అవగాహన చేసుకున్న గుప్పెడు మంది ఆరేడుగురితో అది ప్రారంభం అయ్యింది. అప్పటికే లబ్ధ ప్రతిష్టులయిన, తెలంగాణ పైన బహిరంగంగా మాట్లాడుతున్న వాళ్ల మద్ధతుతో కసరత్తు ప్రారంభం అయ్యింది. చర్చోప చర్చల వల్ల తేలేది ఏమీ లేదు. తెలంగాణ భూమి పుత్రులుగా కార్యారంగంలోకి దూకడమే అని తెగించి ఈ పిడికెడు మంది తలపడ్డారు. అప్పటికి ప్రాంతీయ అస్తిత్వాలకు సంబంధించిన అవగాహనల్లో ‘తటస్థత’ రాజ్యం ఏలుతున్నది. అదోక కపట నినాదం. ఆధిపత్య భావజాలాన్ని కాపాడే సాధనం అని ‘తటస్థత’ అనే ఒక భ్రమను ఈ తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ ఏర్పాటు బద్దలు కొట్టింది. తెలంగాణలో అన్నిరంగాల ఉద్యోగులు, బుద్ధి జీవులు, అందరూ తెలంగాణ అంటున్నప్పుడు జర్నలిస్టులు ‘తటస్థత’ పేరిట అటు ఇటూ కాకుండా ఉండకూడదని తెలంగాణ బిడ్డలుగా తెలంగాణ తల్లి విముక్తి మన బాధ్యత అని కుండబద్ధలు కొట్టంది టీజేఎఫ్.

‘తెలంగాణ మే, 31’ అనే ఒక పుస్తకం 13 వ్యాసాల సంకలనం. ఆనాడే ఆవిష్కృతమయింది. ‘ఔర్ ఏక్ దక్కా ఆఖ్ రీ మోఖా’ అనే నినాదంతో ఒక చిన్న కరపత్రం. జర్నలిస్టులు ‘తటస్థతను’ బద్దలు కొట్టి బయటపడ్డారు. కానీ ఏంచేయాలో తెలియదు.

tfj founders

గుప్పెడు మందితో ప్రారంభం అయిన తెలంగాణ జర్నలిస్టు ఉద్యమ కీలక సందర్భాల్లో కీలక పాత్ర పోషించేదాకా ఎదిగింది.

ఒక ఏడాది కాలంపాటు స్తబ్దుగా ఉన్న ‘ఫోరమ్ అనంతర కాలంలో’ ఏది పన్నెండేండ్లపాటు తెలంగాణ అన్ని ఉద్యమాల్లో, అన్ని ఆందోళనల్లో అన్ని పార్టీల అనుసంధానంలో, ఎక్కడ చూసినా జర్నలిస్టులే కనబడే స్థాయికి ఎదిగింది. ఒకవైపు ఆందోళనలు, మోర్చాలు, ఊరేగింపుల్లో, సభలు, ధూమ్ ధామ్ ల్లో పాల్గొంటూనే, మరో వైపు ఉద్యమం చలికితి పడ్డప్పుడల్లా అది మళ్లీ లేచి నిలబడడానికే ఉద్యమాన్ని మరోక మాటుగా ఎగసిపడేలా ఊపిరులూదడానికి బహుముఖ కార్యక్రమాలు చేపట్టింది.

అందుకే సామూహిక కార్యాచరణలే ఆచరణ మార్గాన్వేషణలో సరైన దారులు కనుక్కునేలా, నడిచేలా చేస్తాయనడం. గుప్పెడు మందితో ప్రారంభం అయిన తెలంగాణ జర్నలిస్టు ఉద్యమ కీలక సందర్భాల్లో కీలక పాత్ర పోషించేదాకా ఎదిగింది.

పని భద్రత, ఉద్యోగుల జీత భత్యాలు,రక్షణ వేజ్ బోర్డుల సాధనలో మాత్రమే కూరుకుపోయి గడస సాగిన ట్రెడ్ యూనియన్ రాజకీయాలు బద్దలయ్యాయి. తెలంగాణ జర్నలిస్టులు తెలంగాణ కోసమే అన్న ఏకత్వం సాధ్యమయ్యింది. అవి ఆంధ్ర యాజమాన్యాలైన పత్రికలే అయినా తెలంగాణ చైతన్యంతో జర్నలిస్టులు తమ వృత్తిలో భాగంగా సమస్యలను లేవనెత్తారు. తెలంగాణ పై అన్ని కోణాల్లో వార్తలు రాయడం, వ్యాసాలు రాయడం, ప్రారంభం అయ్యింది. నీటిగోస, నియామకాల వివక్ష, నిధుల మళ్లింపులతో పాటు వలస ఆధిపత్యం, భావనలు, పోకడలు అస్తిత్వ వాదనల కథనాలు విపరీతంగా రాయడం ఒక చైతన్యం అయితే ప్రత్యక్షంగా ఉత్యమంలో మమేకం కావడం మరో పార్శ్వం. అదే జర్నలిస్టుల ఫోరమ్ ప్రధాన మలుపు.

ఈ క్రమంలో చరిత్రాత్మక పోరాటాల్లో భాగం అయ్యింది జర్నలిస్టు ఫోరమ్. ఎన్జీవోలు, జేఏసీలు ఇచ్చిన పిలుపుల్లో మమేకం అయ్యింది. సభలు సమావేశాల్లో ప్రాతినిధ్యం వహించింది. మరోవైపు జర్నలిస్టుల ఫోరమ్ శాఖలను ప్రతి జిల్లాలో ఏర్పరచి వేదికను పటిష్టపరిచింది. కర్ఫ్యూలాంటి వాతావరణాల్లో కూడా జిల్లాలలో నిర్బంధాలను ధిక్కరించిన చరిత్ర జర్నలిస్టులది.

అటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు మాత్రమే కాకుండా ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా ప్రారంభం అయిన విద్యార్థి ఉద్యమం వెంట జర్నలిస్టులు ఉన్నారు. జేఏసీ ఏప్పడడంలో కానీ, విద్యార్థులు నిర్బంధం ఎదుర్కొన్న సందర్భాల్లో కానీ, విద్యార్థులు ఉద్యమ సమస్యలు ఎదుర్కొన్న సందర్భంలో కానీ, చివరకు క్యాంపస్ నిర్బంధం సందర్భంలో కానీ జర్నలిస్టులు విద్యార్థులతో భుజం భుజం కలిపి పోరాడారు. రోజుల తరబడి విద్యార్థి సమూహాల మధ్య జీవించారు. మరోవైపు సింగరేణిలో నిర్బంధం సందర్భంలో తెలంగాణ జర్నలిస్టుల పోరాటం ఎన్నదగింది. సింగరేణి ఉద్యమం మీద ముద్రలు వేసి అణచివేసే ప్రయత్నం చేసినప్పుడు అన్ని పార్టీల నాయకులను కలుపుకొని సింగరేణి జైత్రయాత్ర చేసి లక్షలాది మందితో సమావేశాలు ఏర్పాటు చేసింది జర్నలిస్టుల ఫోరమ్.

కార్మిక, విద్యార్థి, బుద్ధి జీవుల మధ్య జర్నలిస్టులు పని చేసిన తొలి సందర్భం, ఇదొక ఉద్యమ విశేషం కూడా. అసెంబ్లీలో తెలంగాణ మాట వినపడకూడదు అన్నప్పుడు ‘మాక్ అసెంబ్లీ’ ఏర్పాటు చేసి పెద్దఎత్తున ప్రజాప్రతినిధులను కూడగట్టి తెలంగాణ కేతనం ఎగరేసింది జర్నలిస్టులే. అంతటా నిర్బంధం. కదలడానికి మెదలడానికి కాని కాలం. ఆ సమయంలో 144 సెక్షన్ లను అధిగమించి గన్ పార్క్ స్తూపం నుంచి ఆర్టీసీ కళ్యాణమండపం దాకా పది వేల మంది జర్నలిస్టులతో ఊరేగింపు జరిపింది జర్నలిస్టులే. ఒకవైపు ఉద్యమంలో రకరకాల అభిప్రాయ భేదాలు వచ్చిన కాలం అది. ఆర్టీసీ కళ్యాణమండపంలో తెలుగుదేశం, కాంగ్రెస్, సిపీఐ, బీజేపీ, టీఆర్ఎస్ సహా అన్ని పార్టీలను కూడగట్టి మరోవైపు అదే వేదిక మీద గద్దర్, కేసీఆర్ ‘అలాయ్ భలాయ్’ చేయించింది జర్నలిస్టుల ఫోరమ్.

ఇదంతా ఒకెత్తు అయితే, ఒక అస్తిత్వ ఉద్యమ సందర్భంలో కానీ, మరే ఉద్యమ సందర్భంలో కానీ ఇప్పటి వరకు రెండు వేల మంది జర్నలిస్టులు డిల్లీకి వెళ్లిన ఏ సందర్భమూ ఇప్పటి వరకు చరిత్రలో లేదు. తెలంగాణ నుంచి ప్రత్యేక రైలు కట్టుకుని 2 వేల మంది జర్నలిస్టులు డిల్లీ వెళ్లి ఊరేగింపు జరిపి పార్లమెంటు పక్కలో టెంట్ వేసి తెలంగాణ అన్ని పార్టీల నాయకులతో రోజంతా ధర్నా చేసిన ఘనత తెలంగాణ జర్నలిస్టు ఫోరమ్ దే. ఇదోక మహాత్తర ఘట్టం. ఆఖరు చలో హైదరాబాద్ లో మేమున్నాం. సాగరహారంలో మేమున్నాం. వీధి మలుపుల్లో వేసిన అడ్డంకులను దాటుకొని నిర్బంధాలను ఎదిరించిన వాళ్లలో మేమున్నాం. మా కలాలు తెలంగాణ రాతలు రాస్తే…మా గళాలు తెలంగాణ నినాదాలు మోగించిన సందర్భాలు అనేకం.

mock assemb;ly

DELHI

సంఘటనలు చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. ఓయూలో, కేయూలో ఉర్రూతలూగే ప్రజా శ్రేణుల్లో మేమున్నాం. చివరగా ఒక మాట తెలంగాణ బిల్లు అసెంబ్లిలో చర్చకు వస్తున్నది. మన వాళ్ల ఏర్పాట్లు లేవు. తెలంగాణ జర్నలిస్టు ఫోరమ్ కు కేసీఆర్ ఫోన్. ఏమన్న చేయ్యండి రేపు అసెంబ్లీలో తెలంగాణ ఎమ్మేల్యేలు పార్టీలకు అతీతంగా బిల్లుకు మద్దతు పలకాలె. ఒక్క ఫోరమ్ వల్లనే ఇది సాధ్యం అవుతుంది అన్నప్పుడు ఒకే పూటలో ఎస్ఎమ్ఎస్ ల ద్వారా లక్డికాపూల్ హోటల్ లో అన్ని పార్టీల తెలంగాణ ఎమ్మేల్యేలు, ఎమ్మేల్సీలను రప్పించి, అసెంబ్లీ, ‘ఫ్లోర్ మేనేజ్ మెంట్’ రూపకల్పన ఫోరమ్ సమావేశంలో జరిగింది. న్యాయవ్యాది ప్రకాశ్ రెడ్డి సహకారంతో అసెంబ్లీలో వ్యూహన్ని రచించింది తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ సమావేశంలోనే.

ఇన్నెందుకు . . తెలంగాణ సాధనలో భుజం భుజం కలిపి మార్గం వెతుకులాట . . కొంగొత్త పోరాట రూపాలు కనుగొని ఊరేగిన ఉద్యమం జర్నలిస్టులదే. తెలంగాణ జర్నలిస్టు ఫోరమ్ ఒక బ్యాంకు ఖాతా కూడా లేకుండా నడిచింది. కేసీఆర్ అధికారికంగా ఇచ్చిన అయిదు లక్షల పార్లమెంటు జీతం చెక్కు మాకు అందిన పెద్దనిధి. తెలంగాణ ప్రకటన తర్వాత తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ 10 వేల మంది జర్నలిస్టుల సమక్షంలో కేసీఆర్ చేతుల మీదుగా ‘తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం’ ‘టీయూడబ్ల్యూజే’గా రూపుదిద్దుకొని అవే లక్ష్యాల మేరకు పరిమితుల్లో పని చేస్తూనే ఉన్నది.

కానీ, తెలంగాణ జర్నలిస్టు పోరాట అనుభం, కార్యాచరణ జర్నలిస్టు ఉద్యమాలకు ఒక కరదీపిక. అస్తిత్వ ఉద్యమాల్లో ‘తటస్థత’ను బద్దలు కొట్టి తెలంగాణ కోసం నిలబడిన ఈ పోరాటం చరిత్రకు ఎక్కదగింది. జై తెలంగాణ.

allam anna

LOGOఅల్లం నారాయణ తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ (టీజేఎఫ్), వ్యవస్థాపక కన్వీనర్, అధ్యక్షుడు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article