Editorial

Saturday, September 21, 2024
కథనాలుబుద్ధుని దంతం ఉన్న ధనంబోడు - నేటి అరవింద్ సమేత

బుద్ధుని దంతం ఉన్న ధనంబోడు – నేటి అరవింద్ సమేత

Dhanambhodu

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు సమీపంలో తూర్పు దిక్కులో ఉన్న ధనంబోడు అనే మట్టి దిబ్బపై రెండు వేల సంవత్సరాల క్రితం నాటి అరుదైన బౌద్ధస్తూపం ఆనవాళ్ళు ఉన్నాయి. బుద్ధుని దంతాన్ని ఉంచిన స్తూపంగా ఇక్కడి బౌద్ద స్తూపం ప్రసిద్ధి పొందింది.

అరవింద్ పకిడె

ధనంబోడుకి అసలు పేరు వేలగిరి. ప్రస్తుతం ధనంబోడుగా పిలవబడుతొంది. నిజానికి బోడు అంటే శిఖరం. పురాతన కాలంలో ఇక్కడ పెద్ద ఎత్తున ధనం పాతి పెట్టారని స్థానికులు భావిస్తారు. అందుకే ఈ ప్రాంతాన్ని ‘ధనం బోడు’ అని పిలుస్తున్నారు.

గుంటూరు జిల్లాలోని అమరావతి, ఇటు నల్గొండ జిల్లాలోని నాగార్జునకొండల్లో బౌద్ధ క్షేత్రాల నిర్మాణం జరిగిన కాలంలోనే ధనంబోడు నిర్మాణం జరిగిందని తెలిపే చారిత్రక ఆధారాలు లభించాయి.

అనేక బౌద్ధ స్థూపాల్లో స్వయాన బుద్ధుడివి, లేదా బౌద్ధువులవి అవశేషాలు వుంచి నిర్మించారని చెబుతుంటారు. అటువంటి స్థూపాలను ధాతు స్థూపాలనే పేరుతో పిలుస్తారు. ధనం బోడు స్తూపం కూడా అందులో ఒకటి. ఇక్కడ స్వయాన బుద్ధుడి దంత అవశేషాన్ని వుంచడమే ఆ ప్రత్యేకతకి కారణం.

సంఘ సంస్కరణోద్యమ కేంద్రంగా ధనంబోడు ఉండేదని, ఆ కార్యక్రమాలకు మెచ్చిన రాజులు, రాణులు ఉదారంగా విరాళాలు (ధనం) పంపించేవారని, ఆ విధంగా ధనంబోడుకు పేరు వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. సంఘ సంస్కరణోద్యమంలో భాగంగా రాజనర్తకిలు, వేశ్యా వృత్తిలో వున్న వారిని ఆదరించి అక్కడ ఆశ్రయం, పునరావాసం కల్పించేవారని కూడా చెబుతారు.

1818 సంవత్సరంలో ఈస్టిండియా కంపెనీకి చెందిన అలెగ్జాండర్-5 ఈ ప్రాంతంలో మొదటిసారి తవ్వకాలు జరిపించాడని అంటారు. ఆ తవ్వకాల్లో ఇటుక దిబ్బల నుండి నుండి కొన్ని చెక్కబడిన ఆయక స్తంభాలు లభించాయి. వాటి ఆధారంగానే ఇక్కడ పురాతన స్తూపాలు ఉన్నట్లు తెలిసింది. త్రవ్వకాల అనంతరం స్తూపం 3 మీటర్ల వ్యాసంలో ఉన్నట్లు గుర్తించారు.

ఎందుకంటే విగ్రహం శైలి మిగతా వాటితో పోలిస్తే ప్రత్యేకంగా ఉంది. విగ్రహం కింది భాగంలో తామర పూవు మీద ఆరవ శతాబ్దపు అక్షరాలలో ఒక శాసనం చెక్కబడి ఉంది.

ఇక్కడ పెద్దస్తూపం 3 మీ.ల వ్యాసం, చిన్నస్తూపాలు ఒకటి లేదా 2 మీ.ల వ్యాసంతో వున్నాయి.
అమరావతిలో స్థూపాల నిర్మాణానికి ఉపయోగించిన తరహాలో ఉన్న పాలరాతి రాళ్లనే ఇక్కడ కూడా వాడారు. స్తూపం చుట్టూ డిజైన్లు చెక్కిన రకరకాల ఆయక స్తంభాలతో అలంకరించారు. స్థూపాన్ని లోపల భాగంలో ఇటుకలు, మట్టితో తయారు చేశారు. కొండ చుట్టూ నాడు బౌద్ధ సన్యాసులు నివసించిన నివాసాల ఆనవాళ్లు ఉన్నాయి.

ఈ మహా చైత్యం ఇటుకలతో కప్పబడి, రెండు అడుగుల మందపాటి మట్టితో నిండి ఉంది. కొన్ని స్తంభాలపై క్రీ.పూ. 2 వ శతాబ్దం నాటి మౌర్య కాలం నాటి అక్షరాలలో శాసనాలు రాయబడ్డాయి ..
ఇక్కడ మొత్తం పద్నాలుగు శిల్పాలు బయల్పడ్డాయి .వాటిలో ఒక బుద్ధుడి ప్రతిమ తప్ప మిగిలినవన్నీ కేవలం శకలాలు. అవన్నీ ప్రస్తుతం మద్రాసు మ్యూజియంలో ఉన్నాయి. ఇక్కడ దొరికిన నిలబడ్డ బుద్ధుడి ప్రతిమ అరుదైనది.

ఎందుకంటే విగ్రహం శైలి మిగతా వాటితో పోలిస్తే ప్రత్యేకంగా ఉంది. విగ్రహం కింది భాగంలో తామర పూవు మీద ఆరవ శతాబ్దపు అక్షరాలలో ఒక శాసనం చెక్కబడి ఉంది. నాగార్జునచార్యుడి శిష్యుడు జయ ప్రభాహచార్యన సూచనల ఆధారంగా ఆ విగ్రహాన్ని తయారు చేశారని రాసి ఉంది . ఇక్కడి పుణ్యశాల శిల్పంలో మహాబలిపురం రాతి రధాలను, అజంతా చిత్రాలను పోలిన శిల్ప రీతి ఉంది .

మరొక పాలరాతి స్తంభం మీద 6 లేదా 7 శతాబ్దానికి చెందిన తెలుగులిపిలో రాసిన లఘుశాసనం (లేబుల్ శాసనం) కూడా ఉంది. దానిమీద ‘ శ్రీ అక్షరతన్హ్యు’ అని వుంది.

ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన, ముఖ్యమైన శిల్పాల్లో చక్రవర్తిని సూచిస్తున్న పాలరాతి శిల్పం ఒకటి . చక్రవర్తి అతని చుట్టూ ఏడు ఆభరణాలైన రాణి, యువరాజు, మంత్రి, ఏనుగు, గుఱ్ఱం, చక్రం, రత్నాలు చెక్కబడి ఉన్నాయి . ఆకాశం నుండి చక్రవర్తిపై ,చతురస్రాకార నాణేలు వర్షం కురిసినట్లు ఉన్నాయి .

తరలిపోయిన పురావస్తు సంపద

ధనంబోడు స్తూపం దగ్గర ప్రస్తుతం గొప్ప శిల్పకళలను తెలిపే శిల్పాలు ఏమీ లేవు, వాటి శిధిలాల ఆనవాళ్లు మాత్రమే మిగిలాయి.గతంలో ఇక్కడ నుండి 14 విగ్రహాలను మద్రాస్ మ్యూజియానికి తరలించారు.

అమరావతిలోని పురావస్తు శాఖ మ్యూజియంలో జగ్గయ్యపేట ధనంబోడునుంచి తరలించి భద్రపరచిన విగ్రహాలు వున్నాయి. బ్రిటిష్ పరిపాలనా కాలంలో కొన్ని విగ్రహాలు లండన్ న్యూయార్క్, బోస్టన్ నగరాలకు తరలించారట . వీటి ప్రాముఖ్యత తెలియని స్థానికులు కొన్నింటినీ ఎత్తుకెళ్ళి గృహ నిర్మాణ పనులకు వాడారు .ఇప్పటికీ ఈ ప్రదేశమంతా నిధుల దొంగల తవ్వకాలతో గత వైభవాన్ని కోల్పోయింది. ఇంకా అక్కడ మిగిలివున్న శిథిలాలను కాపాడి బౌద్ధస్తూపాన్ని పునర్నిర్మాణం చెయ్యాలి.

ఎలా వెళ్ళాలి ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నుండి సుమారు 80 కి.మీ. దూరంలో ఉంది.

హైదరాబాదు-విజయవాడ జాతీయ రహదారి నుండి 3 కిలోమీటర్ల దూరంలో జగ్గయ్యపేట స్తూపం ఉంది.

అమరావతి , హైదరాబాద్ ఇతర ప్రముఖ పట్టణాల నుండి ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ బస్సులు అందుబాటులో ఉంటాయి .సొంతం వాహనాల ద్వారా కూడా వెళ్ళవచ్చు .

దగ్గరలో ఉన్న దర్శనీయ ప్రదేశాలు

ధనంబోడు పక్కనే సుమారు 100 ఎకరాలలో విస్తరించి ఉన్న జగ్గయ్యపేట చెరువు చుట్టూ ఒక రహదారి, మధ్యలో బుద్ధుని విగ్రహం, పార్క్ ఏర్పాటు చేశారు .ఆ పార్క్ కి బుద్ధ విహార్ అని పేరు పెట్టారు. సాయంత్రం సమయంలో అక్కడకు వెళ్ళి సేదతీరవచ్చు.

Aravind Pakide

అరవింద్ పకిడె పాత్రికేయడు, ఫోటోగ్రాఫర్. చరిత్ర, సంస్కృతి గురించి నిరంతరం తపనలు పోతూ అందంగా రికార్దు చేసే క్షేత్రస్థాయి అడుగు, కన్ను.

తన ఫేస్ బుక్ అకౌంట్

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article